కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, మే 13న సమావేశమైన కేంద్రమంత్రివర్గం దీనికి ఆమోదం తెలపడంతోపాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది. 2025తో పోలిస్తే అత్యధికంగా పొద్దుతిరుగుడు గింజల ధర రూ.622, అత్యల్పంగా మొక్కజొన్న ధర రూ.10 పెరిగింది. సాగు ఖర్చుల కంటే పెసలుకు 61%, మొక్కజొన్న.. సజ్జలకు 56%, కందులకు 54%, మినుములకు 51% అదనపు ధర లభించనుంది. మిగిలిన పంటలకు 50% అదనపు ధరను నిర్ణయించింది. ఆహారధాన్యాల్లో రాగులు, పప్పుదినుసుల్లో పెసలు, నూనెగింజల్లో నువ్వులకు అత్యధిక ధరలు లభిస్తున్నాయి.
ప్రతి పంటకు దాని ఖర్చుపై 1.5 రెట్ల ధర కల్పిస్తామని 2018-19 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.